నిరుద్యోగులు నిత్యం ఎన్ని సమస్యలు, ఒత్తిళ్ళు ఎదుర్కోంటారో అందరికీ తెలుసు. ఏదో విధంగా ఉద్యోగం సంపాదించుకొని తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే వారి కోరికను, ప్రయత్నాలను బలహీనతగా భావించే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా మిషన్ భగీరధలో 1,350 ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయంటూ ఒక నకిలీ ప్రభుత్వ నోటిఫికేషన్ను సర్క్యులేట్ చేస్తున్నారు. పదో తరగతి పాసై, 18 నుంచి 40 ఏళ్ళులోపు ఉన్నవారు అర్హులని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 30వ తేదీలోగా రూ.110 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ నకిలీ నోటిఫికేషన్ విషయం మిషన్ భగీరధ ఈఎన్సీ కృపాకర్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన దానిని ఖండించారు. మిషన్ భగీరధలో ఎటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెప్పారు. అటువంటి ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వోద్యోగాలకు సాధారణంగా పత్రికలలో, టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్లు, వివరాలు ప్రకటించబడుతుంటాయి తప్ప సోషల్ మీడియాలో రావని నిరుద్యోగులు గ్రహించాలి.