ఇటీవల తెలంగాణా పోలీస్ శాఖలో ఒకేసారి ఏకంగా 18,428 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఉద్యోగాల భర్తీ సమయంలో ఎక్కువ మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగాల వయోపరిమితిని ఆరేళ్ళకు పెంచారు. దాంతో అధనంగా మరో 75,000 మందికి అవకాశం లభించింది. కనుక ఈసారి కూడా వయోపరిమితిని పెంచాలని కోరుతూ పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఈసారి వయోపరిమితిని మూడేళ్ళకు పెంచాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా అధనంగా మరో 30,000 మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనిపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించింది. త్వరలోనే సిఎం కెసిఆర్, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, ఆర్ధికశాఖ, ఇంటలిజన్స్ అధికారులతో సమావేశమయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.