జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగబోతోంది. ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు.
బుధవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమైనప్పుడు అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందన్నారు. కనుక కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి మాగంటి సునీతని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆమె కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున మహమ్మద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఈ రేసులో నుంచి తప్పించారు. కనుక కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. బీజేపి కూడా తమ అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. కనుక ఆమె స్వయంగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున వాటి మద్యలో ప్రవేశించి ఓడిపోతే తెలంగాణ జాగృతికి మొదట్లోనే ఎదురుదెబ్బ తగులుతుంది. కనుక ఆమె ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది.