నల్గొండ, సూర్యాపేటలో వైద్యకళాశాలలు ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆ రెండు జిల్లాల ప్రభుత్వాసుపత్రులకు ప్రస్తుతం ఉన్న భూమి కొత్త వైద్యకళాశాలలు నిర్మించడానికి సరిపోని, కొత్తగా ఏర్పాటు చేయబోయే ఒక్కో వైద్యకళాశాలకు కనీసం 20 ఎకరాల భూమి అవసరం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. కనుక రెండు జిల్లాలలో వాటి ఏర్పాటుకు తగిన ప్రాంతాలను గుర్తించి అవసరమైతే భూసేకరణ చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 7వ తేదీలోగా రెండు వైద్యకళాశాలలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని అనుమతులు పొందేలా అధికారులు గట్టిగా కృషి చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే వైద్యకళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రుల భవనాల డ్రాయింగ్ లను మంత్రులు పరిశీలించారు.