ఈ నెలాఖరులోగా హైదరాబాద్-పూణే నగరాల మద్య వందే భారత్ రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ రెండు ప్రధాన నగరాల మద్య ఇప్పటికే ఎక్స్ప్రెస్తో సహా వివిధ రకాల 16 రైళ్ళు నడుస్తున్నాయి. కానీ అవన్నీ కూడా 365 రోజులు ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉంటాయి.
కనుక ఈ మార్గంలో వందే భారత్ రైలు నడపాలని చాలా కాలం క్రితమే ప్రతిపాదించారు. కానీ కొత్త రైలు అందుబాటులో లేకపోవడం వలన ఆలస్యమైంది. రైల్వేశాఖ ప్రాధాన్యతా క్రమంలో హైదరాబాద్-పూణేల మద్య వందే భారత్ రైలు కేటాయించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. బహుశః ఈ నెలాఖరులోగా ఈ వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్-పూణే మద్య 592 కిమీ దూరం ఉంది. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ళలో ఈ గమ్యం చేరేందుకు సుమారు 11 నుంచి 13 గంటల సమయం పడుతుంది. అదే... శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు 8.30 గంటలు, దూరంతో ఎక్స్ప్రెస్ రైలులో 8.45 గంటలలో గమ్యం చేరుకోగలవు. కానీ గంటకు 135 కిమీ వేగంతో పరుగులు తీసే వందే భారత్ రైలు ఈ దూరాన్ని కేవలం 8 గంటలలో అధిగమించగలదు.
తాజా సమాచారం ప్రకారం ఈ వందే భారత్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పూణే చేరుకుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.