పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచదేశాలన్నిటికీ రకరకాల వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ‘ఆస్ట్రాజెనెకా’ వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలకు ఒప్పందం చేసుకొని ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.
భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్’ మొదటిరెండు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా, దాని కంటే ఒకడుగు ముందున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండవ, మూడవ దశల క్లినికల్ ట్రయల్స్కు డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. కొవీషీల్డ్ పేరుతో తయారైన ఈ వ్యాక్సిన్ను కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న ముంబై, పూణేలలో సుమారు 5,000 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయి, డిసీజీఐ అనుమతించగానే భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఊతప్పతి మొదలుపెట్టి వీలైనంత త్వరగా దేశంలో అందరికీ చేర్చుతామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు.
భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కాక దేశంలో మరో 5 కంపెనీలు కూడా కరోనాకు వ్యాక్సిన్ తయారుచేయడంలో పోటీపడుతున్నాయి. కనుక ఎట్టి పరిస్థితులలో ఈ ఏడాది డిసెంబర్లోగానే భారత్లో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.