త్వరలో రూ.100, రూ.5 నాణేలను విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ మంగళవారం ప్రకటించింది. స్వర్గీయ ఎమ్.జి. రామచంద్రన్ జయంతి సందర్భంగా ఈ నాణేలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ రెంటిలో ఒకవైపు ఆయన చిత్రం మరొకవైపు నాలుగు సింహాలతో కూడిన అశోక స్థూపం బొమ్మ ఉంటాయని తెలిపింది.
రూ.100 నాణెం వ్యాసం 44మిల్లీ మీటర్లు, బరువు 35 గ్రాములు ఉంటుంది. రూ.5 నాణెం వ్యాసం 23 మిల్లీ మీటర్లు 6 బరువు గ్రాములు ఉంటుంది. వెండి, రాగి, నికిల్, జింక్ మిశ్రమాలతో వీటిని తయారుచేస్తునట్లు తెలిపింది. అయితే ఇవి ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేకంగా పరిమిత సంఖ్యలోనే ముద్రించబడుతున్నాయని భావించవలసి ఉంటుంది.
తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని భాజపా ఉవ్విళ్ళూరుతున్న కారణంగా తమిళప్రజలను, అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలను ప్రసన్నం చేసుకోనేందుకే ఒకప్పటి తమిళ సూపర్ స్టార్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె మాజీ అధినేత ఎమ్.జి. రామచంద్రన్ చిత్రంతో కూడిన నాణేలు ముద్రణకు పూనుకొని ఉండవచ్చు. అయితే భాజపా ఆశించిన ఫలం దక్కుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి.