ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరని గత వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు భాజపా శనివారం తెరదించింది. ఈరోజు సాయంత్రం లక్నోలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో భాజపా ఎమ్మెల్యేలు ఆదిత్యనాథ్ యోగి(44)ని తమ నేతగా ఎన్నుకొన్నారు.
ఆదిత్యనాథ్ యోగి కరడుగట్టిన హిందువాది. హిందూ యువ వాహిని అనే సంస్థను కూడా స్థాపించారు. చిన్న వయసు నుంచే ఆర్.ఎస్.ఎస్.లో పని చేస్తున్నారు. దానితో ఉన్న ఆ అనుబంధమే ఇప్పుడు ఆయనకు ఉపయోగపడింది. ఆర్.ఎస్.ఎస్. ఆయనకు గట్టిగా మద్దతు పలుకడంతో ముఖ్యమంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, మనోజ్ సిన్హా తదితరులు పక్కకు తొలగవలసి వచ్చింది. ఆదిత్యనాథ్ యోగి గోరఖ్ పూర్ నుంచి వరుసగా 5సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు.
ఆయన రేపు మధాహ్నం 2గంటలకు లక్నోలోని కాన్షీరాం స్మృతివనంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.