తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం జరిగిన నేతల పోరాటాలు...ఆరాటాలు చల్లారిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో స్తబ్దత నెలకొన్నట్లు కనబడుతోంది. మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.బలరాం నాయక్ దానిపై తనదైన శైలిలో మాట్లాడారు.
గురువారం ఖమ్మం జిల్లాలో లంకపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తన సొంత చరిష్మాతోనే అధికారంలోకి వస్తుంటుంది తప్ప రేవంత్ రెడ్డో మరొకరి వలననో కాదు. కనుక రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినంతమాత్రాన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. ఆ పదవి కోసం పార్టీలో సీనియర్లు పోటీ పడుతున్నారు. అధిష్టానం వారికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ రేవంత్ రెడ్డినే పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే ఓ క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకుడిగా నేను ఆయనకు పూర్తి సహకారం అందిస్తాను. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో జానారెడ్డి గెలవడం తధ్యం. ఆయన గెలుపును టిఆర్ఎస్, బిజెపిళు అడ్డుకోలేవు. కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టిఆర్ఎస్లో చేరడమంటే తనను ఎన్నుకొన్న ప్రజలను, టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేయడమే. ఆయన అంతటితో ఆగకుండా జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమకేసులు బనాయింపజేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఆయనకు ప్రజలే తప్పకుండ బుద్ది చెపుతారు,” అని అన్నారు.