కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్, వారి అనుచరులను తెలకపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం పంప్హౌస్లో నిన్న సాయంత్రం ప్రమాదం జరిగింది. దానిని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలు వెళుతుండగా పోలీసులు వారిని తెలకపల్లి వద్ద అడ్డుకొన్నారు. పోలీసులు తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నాగర్కర్నూల్-అచ్చంపేట రహదారిపై బైటాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కి తిప్పి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బలవంతంగా వ్యానులలో ఎక్కించుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మద్య జరిగిన తోపులాటలో ఎంపీ రేవంత్ రెడ్డి కాలికి స్వల్పంగా గాయమైంది.
అక్కడే ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఓపెన్ కెనాల్ కట్టవలసిన చోట టిఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి సొరంగమార్గంలో నిర్మించింది. ఆవిధంగా చేస్తే చాలా ప్రమాదామని నిపుణుల కమిటీ హెచ్చరికలను కూడా సిఎం కేసీఆర్ పట్టించుకోలేదు. అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకొనేందుకు మేము వెళుతుంటే పోలీసులను పెట్టి అడ్డుకోవడం చాలా దారుణం,” అని అన్నారు.