సచివాలయం కూల్చివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర రావు వేసిన పిటిషన్ ఈరోజు మళ్ళీ విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 15వరకు స్టే పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సచివాలయం కూల్చివేతకు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయానికి సంబందించి ప్రతిని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించకపోవడంతో, ఏ ఆధారం లేకుండా ఈ కేసుపై విచారణ చేపట్టడం సాధ్యం కాదని చెపుతూ ఈ కేసును 15కి వాయిదా వేసింది. ఈరోజు సాయంత్రంలోగా మంత్రివర్గం నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా హైకోర్టు అందజేస్తామని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు.
హైకోర్టు అనుమతితోనే ప్రభుత్వం సచివాలయం కూల్చివేతపనులు మొదలుపెట్టి ఇప్పటికే 60 శాతం వరకు భవనాలను కూల్చివేసింది. ఈ దశలో సాంకేతిక కారణాలతో స్టే విధించడం వలన విలువైన కోర్టు సమయం వృధా అవడం తప్ప వేరే ప్రయోజనం లేదని భావించవచ్చు. ఇప్పుడు కూల్చివేత పనులు నిలిపివేసినప్పటికీ మళ్ళీ అనుమతించకతప్పదని తెలిసి ఉన్నప్పుడు కూల్చివేత పనులను కొనసాగనిస్తూ, దానిలో సాంకేతిక అంశాలపై తరువాత విచారణ చేపట్టవచ్చు కదా?