ఆంధ్రాలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై కొన్నేళ్ళ క్రితం ఉద్యమం ప్రారంభించిన కాపునేత ముద్రగడ పద్మనాభం ఆ ఉద్యమానికి గుడ్ బై చెపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రకటించారు. ఉద్యమం నడిపించడంలో వైఫల్యం చెందానని, ఉద్యమం కోసం సేకరించిన నిధులు స్వాహా చేశాననే విమర్శలతో తీవ్రమనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక లక్ష్యంవైపు అడుగులు వేస్తున్న తనకు సహకరించేవారి కంటే విమర్శించేవారు, వెనక్కు లాగేవారే ఎక్కువగా ఉన్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా కాపుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న తనపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే సోషల్ మీడియాలో విమర్శలు చేయిస్తున్నందున ఇక ఈ ఉద్యమాన్ని కొనసాగించదలచుకోలేదని ఉద్యమ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నాయనని ఇకపై ఎవరైనా దానిని నడిపించుకోవచ్చునని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.