తెలంగాణ డిజిపికి అరుదైన గౌరవం

April 08, 2020


img

తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దేశంలో టాప్ 25 ఐపీఎస్‌ పోలీసు అధికారులలో మహేందర్ రెడ్డి కూడా స్థానం దక్కించుకొన్నారు. వివిద అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఏసియా పోస్ట్, ఫేమ్ ఇండియా, పీఎస్యూ సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా సర్వేలో డిజిపి మహేందర్ రెడ్డి టాప్ 25 ఐపీఎస్‌ పోలీసు అధికారులలో నిలిచారు. 1995కు ముందు బ్యాచ్ ఐపీఎస్‌ పోలీసు అధికారులను మాత్రమే పరిగణనలో తీసుకొని ఆ స్థాయిలో ఉన్న 4,000 మందిపై ఆ సంస్థలు ఈ సర్వే నిర్వహించాయి. శాంతిభద్రతల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం  వినియోగించుకోవడం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో సంబందాలు, పబ్లిక్ రిలేషన్స్, అంకితభావం వంటి అనేక అంశాల ఆధారంగా వారిలో నుంచి 200 మందిని ఎంపిక చేశారు. మళ్ళీ వారిలో అందరికంటే అత్యుత్తమైన అధికారులుగా 25 మంది సేవలు అందిస్తున్నట్లు గుర్తించి ఎంపిక చేశాయి. వారిలో మన తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి కూడా ఒకరుగా నిలవడం మన రాష్ట్రానికి, మన అందరికీ గర్వకారణమే. 


Related Post