మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు మహబూబ్నగర్ వైద్యకళాశాలలో ఏర్పాటు చేసిన 250 పడకల ఐసోలేషన్ వార్డును పరిశీలించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “కరోనా లక్షణాలున్నవారు భయపడి దాచుకొనే ప్రయత్నం చేయవద్దు. ముఖ్యంగా నిజాముద్దీన్లో జరిగిన మార్కజ్ మతసమావేశాలలో పాల్గొని తిరిగివచ్చినవారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే 14 రోజులు క్వారంటైన్లో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. క్వారంటైన్లో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. ఉచితంగా కరోనా వైద్యపరీక్షలు, అవసరమైతే చికిత్స కూడా చేయిస్తాము. ఎవరికైనా నిజాముద్దీన్ వెళ్ళివచ్చినవారి గురించి సమాచారం తెలిస్తే స్థానిక వైద్య బృందాలకో లేదా పోలీసులకో తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ చుట్టుపక్కల ఎవరైనా విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారెవరైనా ఉన్నట్లయితే తక్షణమే తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.