తెలంగాణ రాష్ట్రం త్వరలో కరోనా నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని సిఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యి రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకొంటున్న చర్యలు, పంటలు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రంలో 25,935 మందిని క్వారంటైన్లో ఉంచాము. వారిలో ఎవరికీ ఇంతవరకు కరోనా లక్షణాలు కనబడలేదు. ఏప్రిల్ 7వ తేదీకి వారికి రెండు వారాల క్వారంటైన్ గడువు ముగుస్తుంది. వారందరికీ కరోనా సోకలేదని నిర్ధారించుకొన్న తరువాత ప్రతీరోజు కొంతమంది చొప్పున ఇళ్లకు పంపిస్తాము. ఇళ్ళలో ఉంటూ క్వారంటైన్ పాటిస్తున్నవారిపై ఆంక్షలు తొలగిస్తాము. కరోనా సోకి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారిలో 11 మంది కొలుకొంటున్నారు. పూర్తిగా కోలుకొన్న తరువాత వారిని కూడా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసి ఇళ్ళకు పంపించేస్తాము. ప్రస్తుతం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కనుక ఇప్పటికే రాష్ట్రంలో కరోనా సోకిన 70 మందికి తప్ప కొత్తగా కరోనా కేసులు నమోదుకావని ఆశిస్తున్నాను. కనుక వచ్చే నెల మొదటివారం తరువాత రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడుతుందని భావిస్తున్నాను. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కానీ కొందరు ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటివారిపై కటినచర్యలు తీసుకొంటాము,” అని అన్నారు.