నిజామాబాద్ జిల్లాలో నవీపేటలో టిఆర్ఎస్ నేత కొంచ రమణారెడ్డి (54)ను గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలు దారుణంగా హత్య చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రమణారెడ్డి తన ఇంటి ఆవరణలో ఫోన్లో మాట్లాడుతుండగా, హటాత్తుగా కొందరు వ్యక్తులు లోపలకు ప్రవేశించి ఆయనపై కత్తి, గొడ్డలితో తల, మెడపై నరికి పారిపోయారు. ఆయన ఇంటికి చుట్టూ ప్రహారీగోడ ఉండటం, ఆ సమయంలో ఆయన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆయనపై దాడి జరిగినట్లు ఎవరూ గుర్తించలేదు. ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగివచ్చిన ఆయన రెండో కూతురు రక్షిత తండ్రి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భయంతో పెద్దగా కేకలు పెట్టడంత ఇరుగుపొరుగువారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అంబులెన్స్ అక్కడకు చేరుకొనేసరికే కొనప్రాణంతో ఉన్న రమాణారెడ్డి మృతి చెందాడు. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం హంతకుల కోసం గాలింపు మొదలుపెట్టింది.
హతుడు రమణారెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భార్య భర్తల మద్య విభేదాలు తలెత్తడంతో ఆమె పెద్దకూతురు హరిణిని, చిన్న కూతురు హిమాబిందును తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో కూతురు రక్షిత మాత్రం తండ్రి వద్దే ఉంటోంది. రమణారెడ్డిని ఆయన రాజకీయ ప్రత్యర్డులు ఎవరైనా హత్య చేశారా లేక అతని భార్య నాగసులోచనకు దీనితో ఏమైనా సంబందం ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.