సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈనెల 24నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో హైదరాబాద్తో సహా అన్ని పట్టణాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేసేందుకు ఈ పట్టణ ప్రగతిలో చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలక్టర్లు, అదనపు కలక్టర్లు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, అని శాఖల ఉన్నతాధికారులు విధిగా పాల్గొనాలని సిఎం కేసీఆర్ సూచించారు. కనుక వారందరితో మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి, ఈ కార్యక్రమం ముఖ్యోదేశ్యం, లక్ష్యాలు, విధివిధానాల గురించి వారికి వివరించనున్నారు.
ఇంతకు ముందు పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనడంతో అది విజయవంతం అయ్యింది. దాంతో గ్రామాలలో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. అదే స్పూర్తితో ఇప్పుడు రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలలో పట్టణ ప్రగతిని అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.