డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్పై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. డిల్లీలోని మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన నిన్న రాత్రి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా జనం మద్యలో నుంచి హటాత్తుగా ఓ వ్యక్తి వచ్చి కారులో ఉన్న ఆయనపై తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎమ్మెల్యే తృటిలో తప్పించుకోగలిగారు కానీ పార్టీ కార్యకర్త ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు చేతిలో తుపాకీ ఉండటంతో ఎవరూ అతనిని పట్టుకొనే సాహసం చేయలేకపోవడంతో కాల్పులు జరిపిన వెంటనే జనంలో కలిసిపోయి తప్పించుకొని పారిపోయాడు.
విజయోత్సాహాంతో సంబరాలలో మునిగి ఉన్న ఆమ్ ఆద్మీ నేతలు, కార్యకర్తలు ఈ ఘటనతో దిగ్బ్రాంతి చెందారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ స్పందిస్తూ, “ఈ ఘటనలో నా అనుచరుడు మృతి చెందడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నాపై ఎవరు, ఎందుకు దాడి చేయాలనుకున్నారో తెలియదు. వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి మాపై దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని, అతని వెనుకున్నవారినీ కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.