అత్యాచార కేసులలో దోషులకు 21 రోజులలో ఉరిశిక్ష విధించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టాన్ని శాసనసభ ఆమోదిస్తున్నప్పుడే గుంటూరులో తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు 5 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశాడు. అతను ఇంటర్ విద్యార్ది కావడంతో పోలీసులు ముందుగా అతని వయసు నిర్ధారణ కోసం 10వ తరగతి సర్టిఫికేట్ను పరిశీలించగా నిందితుడికి 19 ఏళ్ళని తేలింది. కనుక కొత్తగా అమలులోకి వచ్చిన దిశ చట్ట ప్రకారం 21 రోజులలో విచారణ పూర్తి చేసి అతనికి ఉరిశిక్ష విధించబడాలి.
ఈ ఘటనపై వైసీపీ సీనియర్ నేత, ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ, “ఈ కేసులో నిందితుడికి దిశ చట్టాన్ని వర్తింపజేస్తాము. ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడేవారికి ఉరిశిక్షే సరైనదని భావిస్తున్నాను. రాష్ట్రంలో మహిళల భద్రతకు, ఆత్మగౌరవానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని దిశ చట్టం ద్వారా నిరూపించుకొంది,” అని అన్నారు.
నిన్న మధ్యాహ్నం నేరం జరిగింది కనుక నిన్నటి నుంచి మూడు వారాలు అంటే జనవరి 4-5లోగా ఈ కేసు దర్యాప్తు, విచారణ పూర్తిచేసి చట్ట ప్రకారం దోషికి ఉరిశిక్ష విధించవలసి ఉంటుంది. అది సాధ్యమో కాదో ఆరోజున తేలిపోతుంది. ఒకవేళ ఈ కేసులో దోషికి 21 రోజులలోగా ఉరిశిక్ష విధించగలిగితే ఇకపై ఏపీలో ఇటువంటి నేరాలు చేయాలంటే నేరస్తులలో తప్పకుండా భయం ఏర్పడుతుంది.