ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు తెలంగాణ బంద్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బసు డిపోల వద్ద, సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించింది పోలీస్ శాఖ. హైదరాబాద్లోని బస్భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఆర్టీసీ కార్మికులు బస్సు డిపోల ముందు బైటాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో హైదరాబాద్, సికింద్రాబాద్తో సహ రాష్ట్రంలో పలుడిపోలలో బస్సులు బయటకు రాలేదు. నిజామాబాద్ జిల్లాలో రెండు ప్రాంతాలలో బస్సులపై ఆందోళనకారులు రాళ్ళు రువ్వడంతో బస్సు అద్దాలు పగిలాయి. పోలీసుల రక్షణలో రెండు బస్సులు మళ్ళీ డిపోలకు చేరుకొన్నాయి.
బంద్లో పాల్గొనేందుకు తరలివచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు కాంగ్రెస్, బిజెపి నేతలను గృహ నిర్బందంలో ఉంచారు. పరకాలలో 20 మంది ఆర్టీసీ కార్మిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.బంద్కు రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నందున దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.