ఈనెల 21న హుజూర్నగర్ ఉపఎన్నికలు జరుగనున్న నేపద్యంలో సిఎం కేసీఆర్ ఈ నెల17న హుజూర్నగర్లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఉపఎన్నికలకు ముందు ఆర్టీసీ సమ్మె మొదలవడంతో దాని ప్రభావం ఎంతోకొంత ఎన్నికలపై, తెరాసపై ఉంటుంది. కనుక ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొన్నప్పుడు సిఎం కేసీఆర్ హుజూర్నగర్లో ఎన్నికల ప్రచారసభ నిర్వహించడం తెరాస అభ్యర్ధి సైదిరెడ్డికి మేలు చేయవచ్చు. ఒకవేళ ఉపఎన్నికలు జరిగేలోగా ఆర్టీసీ సమ్మెను ముగింపజేయగలిగితే తెరాస ఒడ్డున పడగలదు లేకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతీ రెడ్డికి విజయావకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఆర్టీసీ సమ్మె కొనసాగాలని ప్రతిపక్షాలు, సమ్మెకు ముగింపజేయాలని తెరాస కోరుకోవడం సహజం.
ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులతో చర్చించబోమని భీష్మించుకొని కూర్చోన్న తెరాస సర్కార్ కే కేశవరావు ద్వారా చర్చలకు తెర తీసింది. ఆర్టీసీ కార్మికులు కూడా బెట్టు వీడి ప్రభుత్వంతో చర్చలకు సిద్దపడ్డారు కనుక త్వరలోనే సమ్మె ముగియవచ్చు. ఆర్టీసీ సమ్మెపై ప్రజాభిప్రాయం హుజూర్నగర్ ఉపఎన్నికలలో కనబడవచ్చు.