మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ లాబీలో ఆర్ధికమంత్రి హరీశ్ రావుతో సుమారు అర్ధగంటసేపు భేటీ అయినట్లు తాజా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బిజెపిలో చేరేందుకు సిద్దమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు ఆ పార్టీలో చేరలేదు. కనుక నేటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కానీ పార్టీ కార్యక్రమాలకు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తెరాసలో ముఖ్యనేత హరీశ్ రావుతో భేటీ అవడంతో ఇప్పుడు తెరాసలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సివస్తోంది. కానీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయనను తెరాసలో చేర్చుకోవడానికి సిఎం కేసీఆర్ అంగీకరిస్తారా? ఒకరు కాంగ్రెస్, మరొకరు తెరాసలో కొనసాగితే కష్టం కనుక కోమటిరెడ్డి సోదరులిద్దరూ తెరాసలో చేరేందుకు సిద్దం అవుతున్నారా?లేక హరీశ్ రావునే బిజెపిలోకి తీసుకువెళ్ళాలని ఆ పార్టీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాయబారం చేస్తున్నారా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు.