మంత్రివర్గ విస్తరణ తరువాత పదవులు లభించనివారు అలకపాన్పు ఎక్కడం మామూలే.... వారిని ఏదో పదవితో బుజ్జగించి మళ్ళీ దారికి తెచ్చుకోవడం కూడా మామూలే. వాటిలో ప్రస్తుతం అలకపాన్పుల అధ్యాయం నడుస్తోందిప్పుడు. నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, మైనంపల్లి హన్మంతరావులు ఇప్పటికే అలకపాన్పు ఎక్కేశారు. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా అలకపాన్పు ఎక్కారు. సోమవారం ఉదయం తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఆయన, మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి మంత్రి పదవి ఇవ్వనందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, తనకు ఇవ్వజూపుతున్న విప్ పదవి కూడా అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఇక మంత్రిపదవుల రేసులో ఉన్న జూపల్లి, బాజిరెడ్డి, రాజయ్యలు పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉంటామని, పార్టీ తమకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తామని తెలిపారు. ఈ అలకపాన్పుల అధ్యాయంలో ఇంకా ఎంతమంది ఉన్నారో తేలితే ఆ తరువాత బుజ్జగింపుల అధ్యాయం మొదలుపెట్టాలని తెరాస అధిష్టానం భావిస్తోంది.