ఏపీ వైసీపీలో సీనియర్ నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు జగన్ క్యాబినెట్లో చాలా కీలకపదవి లభిస్తుందని భావిస్తే, జగన్ ఆమెకు అసలు మంత్రి పదవే ఇవ్వకపోవడంతో ఆమెతో సహా అందరూ చాలా షాక్ అయ్యారు. మంత్రిపదవి ఇవ్వకపోవడంతో ఆమె అలకపాన్పు ఎక్కారు. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా ఆమె హాజరుకాలేదు. “మంత్రిపదవి ఇవ్వదలచుకోకపోతే ఆ విషయం ముందుగానే నాకు చెప్పి ఉండవచ్చు కదా?చివరి నిమిషంలో ఈవిధంగా అవమానించడం ఎందుకు?” అని ఆమె సన్నిహితులతో అన్న మాటలు ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి చెవిలో పడటంతో మంగళవారం ఆమెను అమరావతికి పిలిపించుకొని మాట్లాడారు. వారి భేటీ ముగిసిన తరువాత ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికవసతుల సమాఖ్య (ఏపీఐసీసీ)కి అధ్యక్షురాలిగా నియమించాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఈ పదవితో తృప్తిపడి ఇప్పటికైనా ఆమె అలకపాన్పు దిగుతారో లేదో చూడాలి.