అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ లోక్సభ ఎన్నికలలో సికిందరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన బిజెపి సీనియర్ నేత కిషన్రెడ్డికి కేంద్రమంత్రి పదవి లభించవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో సికిందరాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి ఇచ్చినందున ఈసారి అదే నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన కిషన్రెడ్డికి తప్పకుండా కేంద్రమంత్రి పదవి లభిస్తుందనేది ఈ ఊహాగానాలకు ఆధారంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఇకపై తెరాసకు ప్రత్యామ్నాయంగా బిజెపిని బలోపేతం చేసుకొంటామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెపుతున్నారు కనుక కేంద్రమంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చుననే వాదన వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు తెరాసను వీడి బిజెపిలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి రాష్ట్ర బిజెపి పగ్గాలు అప్పగించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 29 లేదా 30వ తేదీన నరేంద్రమోడీ మళ్ళీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు కనుక ఆ తరువాత కిషన్రెడ్డి కేంద్రమంత్రి పదవిపై స్పష్టతవచ్చే అవకాశం ఉంది.