జమ్ముకశ్మీర్లో భద్రతాదళాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు లేదా ఆర్మీ క్యాంపులపై హటాత్తుగా విరుచుకుపడి ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు అనేకమంది జవాన్లు మరణిస్తున్నారు. కానీ ఉగ్రవాదులజాడను కనిపెట్టి వారున్న ప్రాంతాలను చుట్టుముట్టి మన భద్రతాదళాలు వారిపై ఎదురుదాడి చేస్తున్నప్పుడు కూడా ఉగ్రవాదుల చేతిలో అనేకమంది జవాన్లు, మేజర్ ర్యాంక్ అధికారులు ప్రాణాలు కోల్పోతుండటం చాలా బాధాకరం.
పుల్వామా ఉగ్రదాడి జరిగిన తరువాత ఆ పరిసరప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న భద్రతాదళాలు ఒక ఇంట్లో కొందరు ఉగ్రవాదులు నక్కినట్లు గుర్తించి ఆ ఇంటిని చుట్టుముయి. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతాదళాలు ఇంటిని చుట్టుముట్టాయి. అది పసిగట్టిన ఉగ్రవాదులు వెంటనే ఎదురుకాల్పులు మొదలుపెట్టారు. ఆ కాల్పులలో ముగ్గురు జవాన్లు, ఒక మేజర్, ఒక పౌరుడు చనిపోగా ఒక జవాను గాయపడ్డాడు. ఇంటిలోపల ముగ్గురు ఉగ్రవాదులున్నట్లు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదులకు-భద్రతాదళాలకు మద్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో భద్రతాదళాలను నిలువరించగల తెగువ, ఆయుధసంపత్తి జైష్-ఏ మహమ్మద్ ఉగ్రవాదులకు మాత్రమే ఉంటుంది కనుక ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు ఆ సంస్థకు చెందినవారే అయ్యుండవచ్చని భద్రతాదళాలు భావిస్తున్నాయి.
ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన వారు:
డిఎస్. డోండియాల్ (మేజర్), అజెయ్ కుమార్, హరి సింగ్(జవాన్లు), సేవారామ్ (కానిస్టేబుల్), ముస్తాక్ అహ్మద్ (పౌరుడు).