తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “జాతీయరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తూ, ఆ ప్రయత్నాలలో భాగంగా భావస్వారూప్యత కలిగిన పార్టీలతో చర్చిస్తున్నారు. వాటిలో భాగంగానే తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి చర్చిస్తే, ఏపీలో టిడిపి నేతలెందుకు భయాందోళనలు చెందుతున్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని గబ్బిలంలా పట్టుకొని వ్రేలాడలేదా? అప్పుడు తప్పుగా కనిపించనిది కేటీఆర్-జగన్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుకొంటే తప్పెలా అవుతుంది? చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తున్నారు,” అని ప్రశ్నించారు. కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి కావడం తద్యమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.