తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా మల్లు భట్టివిక్రమార్కను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి కోసం పార్టీలో చాలామంది పోటీ పడటంతో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే బాధ్యత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకె అప్పజెపుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానం చేయడంతో, దళితుడైన మల్లు భట్టివిక్రమార్కను సిఎల్పీ నేతగా నియమించాలని నిర్ణయించారు. తెరాస వైపు చూస్తున్న సబితా ఇంద్రారెడ్డిని నిలుపుకొనేందుకు ఈ పదవికి ఆమెకు ఇవ్వాలని కూడా ఆలోచించారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత లభిస్తుందనే వాదన వినిపిస్తోంది కనుక సిఎల్పీ నేతగా సబితా ఇంద్రారెడ్డిని నియమిస్తే ఆ వాదనకు బలం చేకూర్చినట్లవుతుంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మల్లు భట్టివిక్రమార్కకే మొగ్గు చూపడంతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.