సిఎం కేసీఆర్ ఆదేశానుసారం ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన లోటస్ పాండ్ నివాసంలో కలువబోతున్నట్లు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి తాము చర్చించబోతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఏపీ సిఎం చంద్రబాబునాయుడును ఆయన పార్టీని రాబోయే ఎన్నికలలో ఓడించేందుకు సిఎం కేసీఆర్ ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సహాయసహకారాలు, మద్దతు, మార్గదర్శనం అందిస్తారని అందరూ ఊహించారు కానీ ఇంత త్వరగా జగన్-కేటీఆర్ భేటీ ఏర్పాటు చేస్తారని ఎవరూ ఊహించలేదు. కనుక ఈరోజు వారి సమావేశం అనంతరం ఏమి ఫెడరల్ ఫ్రంట్, ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల గురించి ఏమి చెపుతారో చూడాలి.