కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

December 14, 2018


img

స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తృటిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు. ఎప్పుడు ఎక్కడా...అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో! అవును తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత “తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం....కారు గుద్దుకొని కూటమి దుర్మరణం...” అనే ఓ జోక్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఒకవేళ వారిరువురూ తమ సోదరి సుహాసిని తరపున కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఉండి ఉంటే, వారు కూడా బాలకృష్ణ, చంద్రబాబునాయుడు మాదిరిగానే నవ్వులపాలయ్యేవారు. కనుక ఎన్నికల ప్రచారానికి వారు డుమ్మా కొట్టి కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగలిగారని చెప్పవచ్చు. కానీ వారి సోదరి సుహాసిని మాత్రం ఈ గులాబీ కారు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. కూకట్‌పల్లి నియోజకవర్గం గురించి, అక్కడి ప్రజల సమస్యల గురించి ఏమీ తెలియకపోయినా బరిలో దిగి ఓడిపోయి నవ్వులపాలయ్యారు. అంటే నందమూరి కుటుంబానికి కారు ప్రమాదాలు తప్పడం లేదని చెప్పుకోవాలేమో? 

వచ్చే ఏడాది జరుగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో గులాబీ కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుందని ఆ కారు డ్రైవరు కేసీఆర్‌ చెపుతున్నారు కనుక నారావారు, నందమూరి వారు కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటే మంచిదేమో?


Related Post