టిఆర్ఎస్ సీనియర్ నేత రమేశ్ రాథోడ్ పార్టీకి గుడ్ బై చెప్పి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన ఈసారి ఖానాపూర్ నుంచి ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నారు. ఇదివరకు టిడిపిలో ఉన్న రమేశ్ రాథోడ్, తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి టిఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికలలో ఖానాపూర్ నుంచి టికెట్ హామీతోనే ఆయన టిఆర్ఎస్లో చేరారు. కానీ ఆయన ఆశిస్తున్న టికెట్ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఇది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించి ఖానాపూర్ టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కనుక ఆయన శుక్రవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.