కాంగ్రెస్లో నుంచి టిఆర్ఎస్లో చేరిన నేతలలో అతి తక్కువ మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుంటారు. ఎందుకంటే, కాంగ్రెస్పై బురద జల్లడం అంటే తమపై తామే జల్లుకోవడమేనని వారికీ తెలుసు. కానీ ఇటీవల టిఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత దానం నాగేందర్ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాళ్ళు విసురుతూనే ఉన్నారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబపాలన సాగుతోందని విమర్శలు గుప్పిస్తున్న టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో తరతరాలుగా సాగుతున్న కుటుంబపాలన కనిపించడం లేదా? ఆయన కుటుంబపాలన వ్యతిరేకిస్తున్నట్లయితే ఈసారి ఎన్నికలలో ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని, కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులకు ఇవ్వనని ధైర్యంగా చెప్పగలరా? చెపితే నేను సగం మీసం తీయించుకొని తిరుగుతాను,’ అని సవాలు విసిరారు.
టిఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. టిఆర్ఎస్ చేతిలో మహాకూటమికి ఘోరపరాజయం తప్పదని అన్నారు. రాబోయే ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సహా చాలా పార్టీలు అదృశ్యమైపోవచ్చునని దానం నాగేందర్ అన్నారు.