సుప్రీంకోర్టు సుతిమెత్తగా ఎన్ని చివాట్లు పెడుతున్నప్పటికీ కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటూనే ఉన్నారు. వాటిపై కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూనే ఉంది. ఇదొక అంతులేని కధలాగ సాగిపోతోంది. ఇవాళ్ళ సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో ఎడ్యూరప్ప బలనిరూపణకు సిద్దం అవుతున్న తరుణంలో భాజపాకు అనుకూలంగా వ్యవహరించే బొప్పయ్యను ప్రోటెం-స్పీకర్ గా గవర్నర్ నియమించారు. అయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో శుక్రవారం మరో పిటిషన్ వేసింది. దానిపై సుప్రీంకోర్టు ఈరోజు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపట్టబోతోంది. ఒకవేళ గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు చెపితే అది భాజపాకు, ముఖ్యంగా ఎడ్యూరప్పకు మరో ఎదురుదెబ్బ అవుతుంది. అనుకూలంగా చెపితే ఎడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గడానికి ఇది ఆఖరి అవకాశంగా మారవచ్చు. సుప్రీంకోర్టు ఏమి చెపుతుందో మరికొద్ది సేపటిలో తేలిపోతుంది.