తమ శాసనసభ సభ్యత్వం రద్దును సవాలుచేస్తూ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వేసిన పిటిషన్లపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత, శాసనసభలో ఆరోజు వారిరువురూ గవర్నర్ నరసింహన్ పై దాడి చేసినట్లు నిరూపించే ఒరిజినల్ వీడియో ఫుటేజి క్లిప్పింగులను ఈనెల 22లోగా కోర్టుకు సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వారిరువురి శాసనసభ్యత్వాల రద్దు కారణంగా జరుగవలసిన ఉపఎన్నికలపై స్టే విధిస్తే ఏమైనా అభ్యంతరమా కాదో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3.30 లోగా తెలియజేయవలసింది కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈసీ జవాబు కోసం ఈకేసును ఈరోజు మధ్యాహ్నం 3.30 వరకు వాయిదావేసింది. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకు ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వరాదని ఈసీని ఆదేశించడం విశేషం.