ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న శాసనసభలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ, “ఈ సమస్యపై మందకృష్ణ మాదిగ ఎంత ఆవేదన చెందుతున్నారో నాకు తెలుసు. నేను కూడా అయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కానీ ఇది ఆయన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే, నేను ఈ సమస్య గురించి సంబంధిత కేంద్రమంత్రితో మాట్లాడితే, తమ ప్రభుత్వం దానిని అమలుచేయదని అయన కుండబద్దలు కొట్టినట్లు నాతో చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో దీని కోసం కేంద్రంతో గట్టిగా పోరాడేందుకు మనకున్న బలం సరిపోదు. దీని గురించి ఏవిధంగా కేంద్రంతో పోరాడి ఒప్పించాలో నాకు బాగా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వమే చేయలేని పనిని మందకృష్ణ మాదిగ చేయలేరు. కనుక వచ్చే ఎన్నికల తరువాత నేనే స్వయంగా ఆ బాధ్యత తీసుకొని ఈ సమస్యపై కేంద్రంతో పోరాడి ఒప్పిస్తాను. ఇదివరకు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఏవిధంగా పోరాడి విజయం సాధించానో, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సమస్యపై కూడా పోరాడి పరిష్కరిస్తానని నేను శాసనసభ సాక్షిగా మాదిగ సోదరులందరికీ హామీ ఇస్తున్నాను. ఈలోగా వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు ఎవరెవరో ఏవో మాయమాటలు చెప్పవచ్చు. అటువంటి వారిని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనిపై తగిన సమయంలో నేను పోరాటం మొదలుపెడతాను. అంత వరకు రాష్ట్రంలో మాదిగలు అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నాను,” అని అన్నారు.