దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ఉన్నతవిద్యాసంస్థలు డిగ్రీ, పీజీ ఫైనల్ టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చునని కేంద్రహోంశాఖ యూనియన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీకి ఓ లేఖద్వారా తెలియజేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) నియమనిబందనల ప్రకారం ఫైనల్ టర్మ్ ఎగ్జామ్స్ తప్పనిసరి కనుక కేంద్ర ఆరోగ్యశాఖ నియమనిబందనలు, మార్గదర్శకాలకు లోబడి ఫైనల్ టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చునని తెలియజేసింది.
ఈ అంశంపై యూజీసీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు లేదా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు పరీక్షల నిర్వహణకు కేంద్రం అంగీకరించింది కనుక యూనివర్సిటీలు అందుకు సిద్దపడినా కరోనా భయం వెంటాడుతూనే ఉంది కనుక ఈ పరిస్థితులలో డిగ్రీ, పీజీ ఫైనల్ టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ యూనివర్సిటీలు అందుకు సిద్దపడినా ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేస్తే మళ్ళీ ఆగిపోయే అవకాశం కూడా ఉంది. కనుక కేంద్రం అనుమతించినప్పటికీ వాస్తవంగా పరీక్షలు మొదలైతే తప్ప జరుగుతాయని ఆశించలేము.