దళితులకు 3 ఎకరాల భూముల కేటాయింపు పధకం ఒక యువరైతు ప్రాణాలను బలిగొంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్ (26) ఈ పధకంలో తనకు భూమిని కేటాయించకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది, తమ గ్రామానికే చెందిన మరొక రైతు పరశురాంతో కలిసి సెప్టెంబర్ 3వ తేదీన కరీంనగర్ జిల్లా అల్గునూరులో మానకొండూరులో గల ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయం ఎదుట నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నారు. వెంటనే జిల్లా అధికారులు వారిరువురినీ హైదరాబాద్ తరలించి యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వారిలో పరశురాం కోలుకోగలిగాడు కానీ శ్రీనివాస్ నిన్న మరణించాడు. ఈ సంగతి తెలుసుకొన్న రసమయి బాలకిషన్ యశోదా ఆసుపత్రికి వచ్చి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అన్ని విధాల అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ భౌతిక కాయానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత పోలీసులు అతని శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.