సీనియర్ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా మరో శపథం చేశారు. ఇక జీవితంలో ఎన్నడూ సంగారెడ్డి నుంచి ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించారు. నాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తనపై అభిమానంతో ఇక్కడికి వచ్చి తనకు మద్దతు తెలిపారన్నారు.
గత ఎన్నికలలో ఆమె మనుమడు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి తనను గెలిపించమని కోరితే, ప్రజలు తనని ఓడగొట్టారన్నారు. తన ఓటమి కంటే రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించినట్లుగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలు రాహుల్ గాంధీ విజ్ఞప్తిని పట్టించుకోకుండా తనను ఓడించినందుకు ఇక జీవితంలో సంగారెడ్డి నుంచి ఎన్నికలలో పోటీ చేయనని జగ్గారెడ్డి శపథం చేశారు.
అయితే ఆయన ఇదివరకే మరో పదేళ్ళవరకు ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటిస్తూ, తన భార్య నిర్మల పోటీ చేస్తారని ప్రకటించారు. కనుక సంగారెడ్డి ప్రజలకి ఆమెపై సానుభూతి కలిగేలా చేసి ఆమెను ప్రమోట్ చేసేందుకే జగ్గారెడ్డి ఇలాంటి ఐడియాలు చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తున్నారు.