ఈరోజు ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మొత్తం 9.81 లక్షల మంది విద్యార్దులు పరీక్షలకు హాజరుకాగా ఇంటర్ ప్రధమలో 2.87 లక్షల మంది (60.01 శాతం), ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది (64.19 శాతం) విద్యార్దులు ఉత్తీర్ణులయ్యారు.
ప్రధమ ఫలితాలలో బాలికల ఉత్తీర్ణత శాతం 68.35 శాతం కాగా, బాలురు 51.5 శాతం ఉంది. ఇదేవిదంగా ఇంటర్ ద్వితీయ ఫలితాలలో బాలికల ఉత్తీర్ణత శాతం 72.53 శాతం కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 56.1 మాత్రమే.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఇంటర్ ప్రధమ ఫలితాలలో రంగారెడ్డి జిల్లా 71.07 శాతం ఉత్తీర్ణతో అగ్రస్థానంలో నిలువగా ఇంటర్ ద్వితీయ ఫలితాలలో ములుగు జిల్లా 81 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.
బుధవారం సాయంత్రం నుంచి ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి విద్యార్దులు తమ మార్క్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్దుల కోసం ఇంటర్ బోర్డు వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 24 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ప్రధమ పరీక్షలు ప్రతీరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ద్వితీయ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి.
ఈ పరీక్షల కోసం విద్యార్దులు తమతమ కాలేజీలలోనే ఏప్రిల్ 25 నుంచి మే 2లోగా చెల్లించవచ్చు. ఇంటర్ మార్కుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కూడా ఇదే గడువులోగా ఆన్లైన్లో చెల్లించవచ్చు.