కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడులో మధురై జిల్లాలోని అవనీయపురంలో జరిగిన జల్లికట్టు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ బహిరంగ సభలో మాట్లాడుతూ తమిళ భాష, సంస్కృతి ఎంతో గొప్పవని అన్నారు. తమిళ భాష ఎంతో ప్రాచీనమైన భాష అని అన్నారు. సంక్రాంతి వేడుకలను తమిళ ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు. తన పట్ల... తన పార్టీ పట్ల తమిళ ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తమిళ భాష, ప్రజలు చాలా వివక్షకు గురయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని రాహుల్ గాంధీ తమిళనాడులో పొంగల్ వేడుకలకు హాజరై ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.