ఆర్టీసీ సమ్మెలో ప్రధానపాత్ర పోషించిన ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో విధులలో చేరారు. కానీ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆరునెలలు శలవు మంజూరు చేయాలని డిపో మేనేజరుకు శలవు అర్జీ పెట్టుకొన్నారు. ఆర్టీసీ యూనియన్ నేతలపట్ల సిఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నందున ప్రస్తుత పరిస్థితులలో ఆర్టీసీలో కొనసాగలేనని అశ్వధామరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. పైగా ఆర్టీసీలో యూనియన్లు వద్దని కోరుతూ ఆర్టీసీ కార్మికుల దగ్గర బలవంతంగా లేఖలు తీసుకొంటుంన్నారని ఆయన ఆరోపించారు. కార్మిక చట్టాలకు విరుద్దంగా ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం ఒత్తిడి తేవడాన్ని ఆయన ఖండించారు. అవసరమైతే కార్మికశాఖ కమీషనర్ లేదా కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అశ్వధామరెడ్డి హెచ్చరించారు.
ఈ పరిస్థితులలో ఆర్టీసీలో ఉద్యోగం చేయడం కష్టమని భావిస్తున్నందునే ఆయన 6 నెలలు శలవుపై వెళ్ళాలనుకొంటున్నట్లు సన్నిహితులు చెపుతున్నారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఆయనకు 6 నెలలు శలవు ఇస్తుందనుకోలేము. కనుక అశ్వధామరెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్లు రాజిరెడ్డి, ధామస్ రెడ్డి, సుధలు విధులలోచేరారు.