ఈరోజు డిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడం లేదు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ కార్యక్రమానికి సంబందించి కొన్ని ముఖ్యమైన ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించవలసి ఉంది కనుక డిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 16న ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ అపాయింట్మెంట్ లభిస్తే ఆరోజు డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు.
గత నెల 30న నరేంద్రమోడీ వరుసగా రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు, ఆ కార్యక్రమానికి సిఎం కేసీఆర్ హాజరుకావలనుకున్నారు కానీ భద్రతాకారణాల రీత్యా ఆ సమయంలో డిల్లీ గగనతలంలో విమానాలకు అనుమతించకపోవడంతో కెసిఆర్ డిల్లీ పర్యటన రద్దు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు రెండవసారి రద్దయింది.