ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఏకంగా 175కు 150 స్థానాలలో ఆధిక్యత సాధించడంతో వైసీపీ ఊహించిన దానికంటే భారీ మెజార్టీతో గెలుపు నిశ్చయమైపోయింది. కనుక ఈ శనివారం అమరావతిలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి జగన్మోహన్రెడ్డిని తమ నాయకుడిగా ఎన్నుకోబోతున్నారు. ఈ నెల 30వ తేదీన జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకొని వచ్చిన తరువాత ఉదయం 8.30 గంటలకు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం అమరావతిలోనే ఉన్న జగన్మోహన్రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతారు.
వైసీపీ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సిఎం కేసీఆర్, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మద్య స్నేహ సంబందాలు బలపడాలని వారు ఆకాంక్షించారు. కేసీఆర్, కేటీఆర్లతో జగన్మోహన్రెడ్డికి సత్సంబంధాలు ఉన్నందున రెండు తెలుగు రాష్ట్రాల మద్య స్నేహ సంబందాలు బలపడటమే కాదు...పరస్పరం సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందగలవు. రాష్ట్ర విభజన సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కరించుకొనవచ్చు.