హైదరాబాద్లో మళ్ళీ ఎన్.ఐ.ఏ.సోదాలు జరుగుతున్నాయి. ఎన్.ఐ.ఏ. అధికారులు ఈరోజు ఉదయం 8గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి నగర శివార్లలోని మైలార్ దేవ్ పల్లిలోని కింగ్ బస్తీ చేరుకొని అక్కడ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 8 మంది యువకుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నారు.
డిల్లీలోని ఒక ఆర్ఎస్ఎస్. నాయకుడిని హత్య చేసి భారీ విధ్వంసం సృష్టించేందుకు హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ప్రయత్నించగా, ఎన్.ఐ.ఏ. వారి కుట్రను ముందుగానే పసిగట్టి భగ్నం చేసి వారిలో అబ్దుల్ బాసిత్ అనే యువకుడిని పట్టుకొన్నట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా నేడు హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తోంది.
గతంలో ఐసిస్ సంస్థలో చేరేందుకు బయలుదేరిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లను కూడా ఎన్.ఐ.ఏ. అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్.ఐ.ఏ.సోదాల సందర్భంగా బస్తీలో తీవ్ర భయాందోళనలు, ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బారీగా పోలీసులను మోహరించారు. ఉదయం 9.45 గంటల సమయానికి బస్తీలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.