రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రోజుకో ఎమ్మెల్యే పార్టీకి గుడ్-బై చెప్పేసి తెరాసలో చేరిపోతున్నారు. తాజాగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సుధీర్ రెడ్డి శుక్రవారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి పార్టీలో చేరాలనుకొంటున్నట్లు చెప్పడంతో ఆయన సాదరంగా ఆహ్వానించారు. తన నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని కేటీఆర్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. ఒకటి రెండు రోజులలో సిఎం కేసీఆర్ను కలిసి రాజకీయ అంశాలపై చర్చించిన తరువాత పార్టీలో చేరుతానని సుధీర్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపర్వం మొదలైంది. ముందుగా ఆత్రం సక్కు, రేగా కాంతారావు, వారి తరువాత చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి ఇప్పుడు సుధీర్ రెడ్డి తెరాసలో చేరుతున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈనెల 19న నిజామాబాద్ బహిరంగసభలో సిఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతునట్లు సమాచారం.