తెలంగాణ సిఎం కేసీఆర్కు తాను స్నేహహస్తం అందిస్తే ఆయన తిరస్కరించారని ఇటీవల ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దానిపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “అవును! చంద్రబాబునాయుడుగారు మాకు ఫోన్ చేసిన మాట వాస్తవమే. అయితే ఒకపక్క ఆయన మా ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ, రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు పన్నుతుంటే మేము వారితో ఎందుకు స్నేహం చేయాలి?అటువంటి వ్యక్తితో పార్టీతో మాకు స్నేహం అవసరం లేదు. ఇదే విషయం ఆయనకు స్పష్టంగా చెప్పాము. ఆయన తన కొడుకును తీసుకొని అమరావతి వెళ్ళిపోయిన తరువాత తన రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేసుకొని ఉంటే మేము కూడా సంతోషించేవాళ్ళం. కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వేలుపెడుతున్నారు. మహాకూటమిలో ముసుగులో తెలంగాణ రాష్ట్రంపై మళ్ళీ పెత్తనం సంపాదించాలని ఆరాటపడుతున్నారు. కనుక చంద్రబాబు నాయుడు, టిడిపిలు మాకు రాజకీయంగా శత్రువులుగానే భావిస్తాము తప్ప బాబుతో స్నేహం చేయలేము,” అని చెప్పారు.