శివరాత్రి ముగియగానే రాష్ట్రంలో మెల్లగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో పగటిపూట ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీలు ఉంటోంది. మార్చి నాటికి ఇంకా పెరుగుతుంది.
కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాలలకు ఒంటిపూట బళ్ళు అమలుకి ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బళ్ళు మొదలవుతాయి. ప్రతీరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు ఉంటాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం పెట్టి పిల్లలను ఇళ్ళకు పంపిస్తారు.
అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండగ సందర్భంగా ఉర్దూ మీడియం విద్యార్ధులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని, అవసరమైతే వారంలో ఒకరోజు అదనంగా తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.