దాదాపు నెలన్నర రోజులుగా నిరంతరాయంగా, అత్యుత్సాహంగా ఐపీఎల్ 16వ సీజన్లో 73 మ్యాచ్లు జరిగాయి. చివరిగా నిన్న అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మద్య జరుగబోయే ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లక్ష మందికి తరలిరాగా, భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల ముందు కూడా ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. కానీ ఎటువంటి ముందస్తు సూచన లేకపోయినా భారీగా వర్షం కురవడంతో ఫైనల్ మ్యాచ్ని నేటికీ వాయిదా పడింది.
ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం నుంచే వర్షం కురవడం ప్రారంభం అవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయినప్పటికీ అందరూ రాత్రి 9 గంటల వరకు ఓపికగా ఎదురు చూశారు. అప్పటికి వర్షం పూర్తిగా తగ్గడంతో మ్యాచ్ మొదలుపెట్టబోతే మళ్ళీ 10 నిమిషాలలో వాన మొదలైంది. మళ్ళీ వాన తగ్గడంతో మ్యాచ్ మొదలుపెట్టేందుకు సిద్దపడుతుంటే మళ్ళీ వాన మొదలైంది. ఇలా 11 గంటల వరకు వరుణదేవుడు అందరితో ఓ ఆటాడుకొన్నాడు. ఇక చేసేదేమీ లేక ఫైనల్ మ్యాచ్ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు మ్యాచ్ నిర్వాహకులు ప్రకటించారు.
నిన్న వర్ష సూచనలేనప్పటికీ వర్షం పడగా ఇవాళ్ళ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందో లేదో తెలీని పరిస్థితి నెలకొంది.
ఒకవేళ వర్షం పడకపోతే మ్యాచ్ జరుగుతుంది. వీలైతే 20 ఓవర్లు, సాధ్యం కాకపోతే 15 లేదా 10 లేదా కనీసం 5 ఓవర్లు మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. కానీ అవీ సాధ్యం కాకపోతే ఒకే ఒక్క సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అదీ సాధ్యం కాకపోతే ఐపిఎల్ నిబంధనల ప్రకారం ఈ సీజన్లో 20 పాయింట్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచిన ‘గుజరాత్ టైటాన్స్’ టీంను విజేతగా ప్రకటిస్తారు.
గుజరాత్ టైటాన్స్ గత ఏడాది ఐపీఏ 15వ సీజనుతో తొలిసారిగా బరిలో దిగినప్పటికీ విజేతగా నిలిచింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు (2010,2011,2018,2021) నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఈసారి 17 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
కనుక ఈ రెండు టీమ్స్ ఫైనల్ మ్యాచ్లో ఢీకొంటే చూడాలని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుంటే, మద్యలో వరుణదేవుడు ‘రాంగ్ ఎంపైరింగ్’ చేస్తూ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాడు. కనుక ఈరోజు సాయంత్రం ఐపీఏ ఫైనల్ మ్యాచ్ జరగనిస్తాడో లేక మ్యాచ్ ఆడకుండానే గుజరాత్ టైటా న్స్ని ఏకపక్షంగా గెలిపిస్తాడో చూడాలి.