తెలంగాణ రాష్ట్ర ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఈసారి రాష్ట్ర బడ్జెట్ 2.90 లక్షల కోట్లు వరకు ఉండవచ్చు. అయితే కేంద్ర బడ్జెట్లో ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి కేటాయింపులు చేయకపోవడంతో రాష్ట్ర బడ్జెట్ను కుదించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
బడ్జెట్లో పంట రుణాల మాఫీకి రూ.30,000 కోట్లు రైతు భరోసాకు రూ.15,000 కోట్లు కేటాయించవలసి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో వివిద సాగునీటి ప్రాజెక్టుల కోసం తీసుకున్న అప్పులు, వడ్డీల చెల్లింపులకు బడ్జెట్లో సుమారు రూ.18,000 కోట్లు కేటాయించక తప్పదు. అలాగే నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు కనీసం రూ.8,000 కోట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇదిగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం, దాని భూసేకరణకు మరో రూ.6,130 కోట్లు అవసరమని అంచనా వేశారు. కనుక వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఉండవచ్చు.
ఇవికాక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు హామీల అమలుకి, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ వంటి వివిద అభివృద్ధి పనులకు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు వగైరాలకు భారీగా నిధులు కేటాయించవలసి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించినా లేదా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంతగా ఋణ భారం లేకపోయి ఉంటే అన్ని రంగాలకు సంవృద్ధిగా నిధులు కేటాయించగలిగి ఉండేది. కానీ ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ కావడంతో ఏ శాఖకు ఎంత కేటాయిస్తారనేడి మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.