బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని బిసిసిఐ కార్యదర్శి జై షాకి పంపించగా ఆయన వెంటనే ఆమోదించారు. చేతన్ శర్మ ఈ పదవిలో నియమితులైన నెలరోజులకే రాజీనామా చేయవలసి వచ్చింది. ఇందుకు చాలా బలమైన కారణమే ఉంది.
ఇటీవల ఓ టీవీ న్యూస్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ టీమ్ ఇండియా ప్లేయర్లు కీలకమైన మ్యాచ్లకి ముందు డోపింగ్ టెస్టులో కూడా పట్టుబడని ఇంజక్షన్లు తీసుకొంటున్నారని, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీకి పడదని వారి మద్య విభేదాలున్నాయని చెప్పారు. టీమ్ ఇండియాలో కూడా విరాట్ కోహ్లీ గ్రూప్, రోహిత్ శర్మ గ్రూప్ వేర్వేరుగా ఉన్నాయని చెప్పారు.
చేతన్ శర్మ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బహుశః బిసిసిఐ ఆయనని రాజీనామా చేయాలని లేదా పదవిలో నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించి ఉండవచ్చు. అందుకే ఆయన రాజీనామా చేసిన్నట్లు భావించవచ్చు. అయితే ఆయన తన తప్పుని తెలుసుకొని జరిగిన పొరపాటుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు తప్ప ఆయనపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని బిసిసిఐ సీనియర్ అధికారి తెలిపారు. చేతన్ శర్మ రాజీనామా ప్రభావం బోర్డర్-గవాస్కర్ టెస్ట్ మ్యాచ్ సిరీస్పై ఎటువంటి ప్రభావమూ చూపదని, మిగతా రెండు మ్యాచ్లకి టీమ్లని త్వరలో ప్రకటిస్తామని బిసిసిఐ అధికారి తెలిపారు.